యవత్మాల్ పాఠశాలలో కత్తుల నృత్యం.. వివాదాస్పద వీడియోపై విచారణ
యవత్మాల్ (మహారాష్ట్ర): గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా మహారాష్ట్రలోని యవత్మాల్ జిల్లా ఉమర్ఖేడ్లో దిగ్భ్రాంతికర ఘటన వెలుగుచూసింది. అబ్దుల్ గఫూర్ షా మున్సిపల్ ఉర్దూ పాఠశాలలో విద్యార్థులు చేతుల్లో కత్తులు పట్టుకుని, పాకిస్థాన్ సైనిక యుద్ధ గీతంగా గుర్తింపు పొందిన ‘ఏ మర్ద్-ఎ-ముజాహిద్ తేరీ యల్గార్ కహా హై’ పాటకు నృత్యం చేయడం వివాదాస్పదంగా మారింది.
1965 యుద్ధ సమయంలో పాక్ సైనికులకు ఉత్తేజం నింపేందుకు వినిపించినట్లు చెప్పబడే ఈ గీతాన్ని భారత గణతంత్ర దినోత్సవం రోజున ప్రదర్శించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో విషయం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
స్థానిక బీజేపీ నేత గోపాల్ కలాణే పోలీసులకు ఫిర్యాదు చేస్తూ, ప్రభుత్వ పాఠశాలలో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం ఆందోళనకరమని పేర్కొన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, సంబంధిత ఉపాధ్యాయులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి వీడియో ప్రామాణికత, కార్యక్రమం నేపథ్యంపై లోతైన విచారణ చేపట్టినట్లు సమాచారం.
